ఏయూ మహా శతాబ్ది ఉత్సవాల్లో వెంకయ్యనాయుడు ఛమక్కులు, చమత్కారాలు

  • ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో ప్రసంగించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
  • మన మూలాలను, మాతృభాషను ఎన్నటికీ మరువద్దని విద్యార్థులకు హితవు
  • పాశ్చాత్య ఆహార సంస్కృతి, పేర్లను కుదించి పిలవడంపై తనదైన శైలిలో విమర్శ
  • ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే జీవితంలో ఉన్నత స్థాయికి చేరవచ్చని ఉద్బోధ
  • క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలి యువతకు అత్యవసరమని స్పష్టీకరణ
ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తనదైన శైలిలో ప్రసంగించి సభికులను ఆకట్టుకున్నారు. పూర్వ విద్యార్థిగా తాను చదువుకున్న విశ్వవిద్యాలయం వేదికపై నిలబడి ప్రసంగిస్తున్నందుకు తన మనసు భావోద్వేగంతో నిండిపోయిందని చెబుతూ, యువతకు దిశానిర్దేశం చేశారు. మారుతున్న కాలంలో యువత అనుసరించాల్సిన జీవన విధానం, దేశభక్తి, మాతృభాషాభిమానం వంటి అంశాలపై ఆయన చేసిన ప్రసంగం ఆలోచింపజేసింది.

మన మూలాలను మరువద్దు
ప్రసంగంలో వెంకయ్యనాయుడు ప్రధానంగా యువత తమ మూలాలను మర్చిపోకూడదని బలంగా చెప్పారు. "కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, చదువుకున్న విద్యాలయాన్ని, పాఠం చెప్పిన గురువును మర్చిపోయినవాడు మానవుడే కాదు" అని ఆయన ఉద్ఘాటించారు. ప్రతి ఒక్కరూ తాము ఎక్కడి నుంచి వచ్చామో గుర్తుంచుకొని, ఏ స్థాయికి ఎదిగినా తాము పుట్టిన ప్రాంతం అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తాను ఒక సాధారణ పల్లెటూరి నుంచి వీధి బడిలో చదువుకొని, క్రమశిక్షణ, కఠోర శ్రమ, అంకితభావం కారణంగానే దేశ రెండవ అత్యున్నత పదవిని అధిరోహించగలిగానని తన జీవితాన్ని ఉదాహరణగా చూపారు. "ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపోయేది లేదు" అనే మంత్రాన్ని యువతకు అందించారు.

కేఆర్ నాయుడు అంటే సరిపోదు
ఆధునిక పోకడలపై వెంకయ్యనాయుడు తనదైన శైలిలో చురకలు అంటించారు. పాశ్చాత్య ఆహారపు అలవాట్లపై మాట్లాడుతూ, "ఈ పిజ్జాలు, బర్గర్లు మన ఒంటికి పడవు. మన పూర్వీకులు అందించిన వంటకాలు, జీవన శైలినే మనం కొనసాగించాలి" అని హితవు పలికారు. ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాముఖ్యతను వివరిస్తూ, చిన్న వయసులోనే క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులు రావడానికి జీవనశైలే కారణమని, యువత వ్యసనాలకు, ముఖ్యంగా డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని కోరారు.

అదేవిధంగా, మహనీయుల పేర్లను, రోడ్ల పేర్లను సంక్షిప్తంగా పిలవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "మహాత్మా గాంధీ రోడ్డును ఎంజీ రోడ్ అని, సర్దార్ పటేల్ రోడ్డును ఎస్పీ రోడ్ అని పిలుస్తున్నారు. ఇంగ్లీష్ వాడు పోతూ పోతూ మనకు ఈ పొట్టి పొట్టి మాటలు అలవాటు చేసిపోయాడు. మన పేర్లను మనం గర్వంగా, పూర్తి పేరుతో పిలవాలి. మీ పేరు కింజరాపు రామ్మోహన్ నాయుడు అయితే, గర్వంగా చెప్పగలగాలి కానీ, కేఆర్ నాయుడు అంటే సందేశం వెళ్లదు" అంటూ తనదైన ఛలోక్తులు విసిరారు.

మాతృభాష ప్రాముఖ్యతపై ఉద్బోధ
మాతృభాష ఆవశ్యకతను నొక్కి చెబుతూ, "తెలుగు మన కంటి చూపు లాంటిది, ఇంగ్లీష్ కళ్లద్దాల వంటిది. కంటిచూపు బాగుంటేనే కళ్లద్దాలు పనిచేస్తాయి. కంటి చూపే లేకపోతే నువ్వు ఏ రేబాన్ గ్లాస్ పెట్టుకున్నా ప్రయోజనం ఉండదు" అని అద్భుతంగా పోల్చారు. "ఫస్ట్ మదర్ టంగ్, తర్వాత బ్రదర్ టంగ్, లేటర్ ఎనీ అదర్ టంగ్" అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. అన్ని భాషలు నేర్చుకోవాలి, కానీ మాతృభాషను ఎన్నటికీ విస్మరించకూడదని స్పష్టం చేశారు.

పరిశోధనలకు పెద్దపీట వేయాలి
పరిశోధనల తీరుపై వెంకయ్యనాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిశోధనలు కేవలం థీసిస్ పేపర్లకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా జరగాలని ఉద్ఘాటించారు. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో భారత్ 40వ స్థానంలో ఉన్నా, విద్యార్థుల్లో పేటెంట్లపై అవగాహన పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్యూర్ సైన్సెస్‌పై ఆసక్తి తగ్గి, మౌలిక విజ్ఞానాన్ని విస్మరిస్తున్నామని, ఈ పరిస్థితిలో మార్పు రావాలని హెచ్చరించారు. స్థానిక అవసరాలే కాకుండా ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపించే స్థాయికి మనం ఎదగాలని పిలుపునిచ్చారు.

తన ప్రసంగం ఆరంభంలో వెంకయ్యనాయుడు విశ్వవిద్యాలయ అభివృద్ధికి పాటుపడిన సర్ సీఆర్ రెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి మహనీయులతో పాటు, భూరి విరాళాలిచ్చిన జైపూర్, విజయనగరం, బొబ్బిలి, పిఠాపురం సంస్థానాధీశులను వెంకయ్య స్మరించుకున్నారు. 

Venkaiah Naidu
Former Vice President
AU Centenary Celebrations
Vizag
Andhra Pradesh

More Telugu News